Pawan Kalyan: 151 మంది ఎమ్మెల్యేలున్న పార్టీ ఒక్క ఎమ్మెల్యే ఉన్న పార్టీపై విమర్శలు చేస్తోంది: పవన్

  • దీన్ని బట్టే జనసేనకు రాష్ట్రంలో ఎంత బలం ఉందో తెలుస్తోంది
  • దెబ్బతగిలినా లేచి నిలబడి పోరాడతా
  • అంతిమ లక్ష్యం కోసం అడుగులు వేసుకుంటూ వెళ్తా

ఆంధ్రప్రదేశ్ లో 151 మంది ఎమ్మెల్యేలున్న వైసీపీ... ఒక్క ఎమ్మెల్యే ఉన్న తమ పార్టీపై విమర్శలు చేస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. దీన్ని బట్టే తమకు రాష్ట్రంలో ఎంతగా బలం ఉందో తెలుస్తోందని అన్నారు. తమ పోరాటంపై ఎంతగా ప్రతి స్పందన వస్తుందో తెలుసుకోవచ్చని అన్నారు. ఈ రోజు విశాఖపట్నంలో పర్యటిస్తోన్న ఆయన ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

'గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశం నాకు కూడా ఉంది. అయితే, వెన్నుపోట్లు, కుట్రలతో నిండిపోయిన రాజకీయాలు సమాజంలో ఉన్నాయి. ఇటువంటి సమాజంలో మనం బలంగా ఉండాలి. అంతేగానీ, వెన్నుపోటు పొడుస్తామంటే పొడిపించుకోవడానికి మేము సిద్ధంగా లేము. పార్టీలో చేరతామని వచ్చే వ్యక్తులు నిస్వార్థంగా ఉంటారని అనుకోవడం పొరపాటే అవుతుంది. అటువంటి వ్యక్తులు ఉంటారని తెలుసు. ఇటువంటివి చూసే నేను రాజకీయాల్లోకి వచ్చాను' అని పవన్ కల్యాణ్ అన్నారు.

'దెబ్బతిన్నా తిరిగి లేచి నిలబడతా. ఘోర ఓటమి తర్వాత కూడా ప్రజల్లోకి వస్తున్నాను. అంతిమ లక్ష్యం కోసం అడుగులు వేసుకుంటూ వెళ్తా. మా సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నందుకే ధైర్యంగా అడుగులు వేశా. ఆశయాల కోసం బలంగా నిలబడతా. కష్టాలు ఉన్నప్పుడు వెనకడుగు వేయను. మన సమావేశాలకు వచ్చిన యువతలో 70 శాతం మంది మాకు ఓట్లు వేసినా జనసేనకు 70 సీట్లు వచ్చేవి. జనసేనకు అండగా నిలబడని యువత కోసం నేను ఇప్పటికీ పోరాడుతున్నాను. వారి బాధలను తెలుసుకుంటున్నాను' అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

More Telugu News