vijayareddy: విజయారెడ్డిని సజీవ దహనం చేసే ముందు.. పెదనాన్నతో మాట్లాడిన నిందితుడు

  • నిందితుడు సురేశ్‌కు మతిస్థిమితం లేదన్న కుటుంబ సభ్యులు
  • అతడిని పావుగా ఉపయోగించుకుని ఉంటారని అనుమానం
  • రియల్ ఎస్టేట్ సంస్థపైనా అనుమానం

అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని సజీవ దహనం చేయడానికి ముందు నిందితుడు సురేశ్ పలుమార్లు ఆయన పెదనాన్న దుర్గయ్యతో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ ఘటన వెనక ఆయన ఉన్నారా? అన్న కోణంలో విచారణ ప్రారంభించారు. భూ వివాదాన్ని పరిష్కరించకపోవడంతో తహసీల్దార్‌ ఎదుటే ఆత్మహత్య చేసుకోవాలని సురేశ్‌ను పంపించి ఉంటారని అయితే, తీవ్ర వాగ్వివాదం జరగడంతో క్షణికావేశంలో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు.

నిజానికి అంతకు ముందెప్పుడూ సురేశ్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వివాదంలో ఉన్న భూమికి సంబంధించి సురేశ్‌కు అసలు అవగాహనే లేదంటున్నారు. మతిస్థిమితం లేని సురేశ్‌ ఎవరైనా రెచ్చగొట్టగానే రెచ్చిపోతాడని, అతడి బలహీనతను ఎవరో ఇలా వాడుకుని ఉంటారని గ్రామస్థులు చెబుతున్నారు. ఇదంతా ఎవరో కావాలనే చేయించారని నిందితుడు సురేశ్ తల్లి కూర పద్మ పేర్కొంది. ఇంతటి ఘాతుకానికి పాల్పడే ధైర్యం అతడికి లేదని ఆమె తెలిపింది.

వివాదంలో ఉన్న భూమిపై ఓ స్థిరాస్తి వ్యాపారి కన్ను పడిందని, ఓ ప్రజాప్రతినిధి సాయంతో వాటిని చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అందులో భాగంగానే ఆ భూములను విక్రయించాలంటూ రైతులపై ఒత్తిడి తీసుకొచ్చారని, ఈ క్రమంలో కొత్త పాస్ పుస్తకాల కోసం తహసీల్దార్‌పైకి రైతులను ఉసిగొల్పినట్టు చెబుతున్నారు.

More Telugu News