Hyderabad: ఆఫీసులోనే మహిళా తహసీల్దారు విజయను సజీవదహనం చేసిన దుండగుడు

  • హైదరాబాదు శివారులో దారుణ ఘటన
  • విజయపై కిరోసిన్ పోసి నిప్పంటించిన ఆగంతుకుడు
  • ఆ తర్వాత తనకు తాను నిప్పంటించుకున్న దుండగుడు

హైదరాబాదు శివారులో దారుణం సంభవించింది. తహసీల్దారుగా పని చేస్తున్న విజయారెడ్డిని ఓ దుండగుడు తగలబెట్టి, దారుణంగా హత్య చేశాడు. నగరంలోని అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దారు కార్యాలయంలో ఈ దారుణం చోటు చేసుకుంది.

కార్యాలయంలోకి ప్రవేశించిన దుండగుడు ఆమెపై కిరోసిన్ పోసి, నిప్పటించి సజీవదహనం చేశాడు. ఈ సందర్భంగా తనపై కూడా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ దారుణాన్ని అడ్డుకోబోయిన ఆఫీసులో పని చేస్తున్న ఇద్దరు సిబ్బంది కూడా గాయపడ్డారు. వీరిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.  జరిగిన ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మధ్యాహ్నం 1.20 గంటలకు తహసీల్దారు కార్యాలయంలోకి హంతకుడు చొరబడ్డాడు. అరగంట సేపు విజయ గదిలోనే ఉన్నాడు. ఆ తర్వాత ఆమెను సజీవదహనం చేశాడు. కాసేపటి క్రితం ఘటనా స్థలికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చేరుకున్నారు. మరోవైపు విజయ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

More Telugu News