sanjay raut: మహారాష్ట్ర గవర్నర్ తో శివసేన కీలక భేటీ.. మర్యాద పూర్వకమే అంటోన్న సంజయ్ రౌత్

  • ఎన్నికల కారణంగా ఇంతకు ముందు ఆయనను కలవలేకపోయాను
  • మా పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతోనూ చర్చించాను
  • రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను గవర్నర్ కు వివరిస్తాను

ముఖ్యమంత్రి పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలంటూ బీజేపీ ముందు డిమాండ్ పెట్టిన శివసేన నేతలు ఈ రోజు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారితో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని వారు కోరనున్నట్లు ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. భగత్ సింగ్ తో శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‌ తో పాటు మరి కొందరు నేతలు సమావేశమయ్యారు.

అంతకు ముందు సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. 'గవర్నర్ ను మర్యాదపూర్వకంగానే కలిశాను. ఆయన చాలా అనుభవం ఉన్న నాయకుడు. గతంలో ఆయన కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎన్నికల కారణంగా నేను ఇంతకు ముందు ఆయనను కలవలేకపోయాను. ఇప్పుడు కలుస్తున్నాను. నేను మా పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో మాట్లాడాను. ఇప్పుడు  గవర్నర్ భగత్ సింగ్ కోష్యారిను కలిసి రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి కూడా ఆయనకు వివరించి చెబుతాను' అని వ్యాఖ్యానించారు.

బీజేపీ పత్రిక 'తరుణ్ భారత్' లో తనను 'భేతాళుడి'గా అభిర్ణించిన విషయంపై సంజయ్ రౌత్ స్పందించారు. విక్రమార్కుడు, భేతాళ కథల్లో ఈ పాత్ర ఉంటుంది. 'మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఎలాగైతే కొన్ని పత్రికలను చదవరో, నేను కూడా అలాగే మా పార్టీ పత్రిక 'సామ్నా' మినహా ఇతర పత్రికలను చదవను. తాము సామ్నాను చదవబోమని సీఎంతో పాటు ప్రధాని మోదీ కూడా గతంలో అన్నారు. అలాగే, నేను కూడా తరుణ్ భాస్కర్ పేరిట ఉన్న పత్రికను చదవను' అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.

More Telugu News