Maharashtra: బీజేపీ వ్యాఖ్యలతో మరింత ముదిరిన మహారాష్ట్ర సంక్షోభం

  • శివసేన బ్లాక్ మెయిలింగ్ పార్టీ అన్న జైకుమార్ రావల్
  • మరోసారి ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీకి మరిన్ని ఎక్కువ సీట్లు వస్తాయంటూ వ్యాఖ్య
  • సంజయ్ రౌత్ ను జోకర్ అన్న బీజేపీ మౌత్ పీస్ 'తరుణ్ భారత్'

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. తాజాగా బీజేపీ చేసిన వ్యాఖ్యలతో సంక్షోభం మరింత ముదిరింది. బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి జైకుమార్ రావల్ ఈరోజు మాట్లాడుతూ, శివసేనను బ్లాక్ మెయిలింగ్ పార్టీ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్ర అసెంబ్లీకి మరోసారి ఎన్నికలను నిర్వహిస్తే బీజేపీకి మరిన్ని ఎక్కువ సీట్లు వస్తాయని తెలిపారు.

బీజేపీ మౌత్ పీస్ అయిన 'తరుణ్ భారత్' పత్రిక తన ఎడిటోరియల్ లో శివసేనను ఏకిపారేసింది. శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ ను 'ఓ జోకర్' అంటూ ఎద్దేవా చేసింది. ప్రకృతి వైపరీత్యానికి రాష్ట్రంలోని 60 శాతం మంది రైతులు తీవ్రంగా నష్టపోయి, నానా ఇబ్బందులు పడుతుంటే... శివసేనకు చీమ కుట్టినట్టు కూడా లేదని మండిపడింది. కేవలం అధికార పీఠాన్ని అధిరోహించడమే దాని ఏకైక లక్ష్యమని పేర్కొంది. సామాన్యులు, రైతుల కష్టాలను పట్టించుకోని శివసేనను ప్రజలు ఎన్నటికీ మన్నించరని తెలిపింది.

శివసేన, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్లే బీజేపీ 105 స్థానాలను గెలుచుకుందని... ఒంటరిగా పోటీ చేసుంటే 70 సీట్ల కంటే ఎక్కువ గెలుచుకోలేకపోయేదంటూ శివసేన చేస్తున్న వ్యాఖ్యలను 'తరుణ్ భారత్' తప్పు బట్టింది. జనాలలో గందరగోళం సృష్టించేలా ఆర్టికల్స్ రాయడం, టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడంలో శివసేన నేతలు బిజీగా ఉన్నారని మండిపడింది.

శివసేనలో ఒక తెలివైన నాయకుడు ఉన్నారని... ఉదయం లేవగానే హిందీ పద్యాలను ట్వీట్ చేయడం, ఆ తర్వాత తప్పుడు వార్తలకు జీవం పోయడమే ఆయన పని అంటూ సంజయ్ రౌత్ పై పరోక్ష వ్యాఖ్యలు చేసింది. సంజయ్ రౌత్ శివసేన అధికార పత్రిక 'సామ్నా'కు ఎడిటర్ గా కూడా వ్యవహరిస్తున్న విషయం గమనార్హం. ట్వీట్లు చేయడం చాలా ఈజీ అని... కానీ, మహారాష్ట్రలాంటి రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలించడం చాలా కష్టమనే విషయాన్ని ఆ తెలివైన నేత గ్రహించాలని ఎద్దేవా చేసింది.

More Telugu News