Pawan Kalyan: ఇక్కడెవరూ బడాబాబులు లేరు, నువ్వే చిరంజీవి తమ్ముడిలా వచ్చావు: పవన్ కు కౌంటర్ ఇచ్చిన మంత్రి వెల్లంపల్లి

  • విశాఖలో జనసేన బహిరంగ సభ
  • వైసీపీ నేతలపై విరుచుకుపడిన పవన్
  • ఘాటుగా స్పందించిన ఏపీ మంత్రి వెల్లంపల్లి

విశాఖ లాంగ్ మార్చ్ లో జనసేనాని పవన్ కల్యాణ్ వైసీపీ నేతలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ ను నేరుగా పేరు పెట్టి విమర్శించకపోయినా, పరోక్ష వ్యాఖ్యలు బాగానే చేసిన పవన్... విజయసాయిరెడ్డి, బొత్స, అంబటి తదితర నేతలను మాత్రం ఉతికారేశారు. దీనిపై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. పవన్ బెదిరింపులకు భయపడే నేతలు ఇక్కడెవరూ లేరని అన్నారు.

ప్రజలు ఎన్నికల్లో తిరస్కరించాక కూడా పవన్ కల్యాణ్ మాట్లాడుతుండడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన కన్నబాబు బాగానే ఉన్నాడని, చిరంజీవి కూడా బాగానే ఉన్నారని మధ్యలో ఈయనకెందుకు బాధ? అని ప్రశ్నించారు. చిరంజీవికి అధికారం దక్కకపోయేసరికి దూరంగా వెళ్లిపోయింది ఎవరు? అంటూ నిలదీశారు.

విజయసాయిరెడ్డిపై పవన్ చేసిన వ్యాఖ్యల పట్ల కూడా వెల్లంపల్లి ఘాటుగా జవాబిచ్చారు. విజయసాయిరెడ్డి తాట తీసేంత దమ్ము నీకుందా అంటూ మండిపడ్డారు. వైసీపీ నేతలు కోట్లకు పడగలెత్తారని పవన్ అనడం సరికాదని, తమలో ఎవరూ బడాబాబులు లేరని అన్నారు. నువ్వు చిరంజీవి తమ్ముడివి కాబట్టే ప్రజల్లో తిరగ్గలుగుతున్నావు అంటూ విమర్శించారు.

More Telugu News