Madhya Pradesh: పాత కేసులో దోషిగా తేలడంతో సభ్యత్వం కోల్పోయిన బీజేపీ ఎమ్మెల్యే

  • రద్దయిన మధ్యప్రదేశ్‌ రాష్ట్రం పవాయ్‌ ఎమ్మెల్యే గిరి
  • ఐదేళ్ల క్రితం తహసీల్దార్‌పై దాడిచేసినట్టు ఆరోపణలు
  • రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన ప్రత్యేక కోర్టు

కోర్టు కేసులు వెంటాడుతుంటే ఎప్పటికైనా ప్రమాదమేనని నిరూపించిన సంఘటన ఇది. ఐదేళ్ల క్రితం ఓ తహసీల్దార్‌పై దాడి చేశారన్న ఆరోపణపై తీర్పు వెలువడడంతో ఓ బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో తన సభ్యత్వాన్ని కోల్పోయారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలావున్నాయి. రాష్ట్రంలోని పవాయ్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రహ్లాద్‌ లోథీ  ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన 2014లో పన్నా జిల్లా తహసీల్దార్‌ ఆర్‌.కె.వర్మపై దాడి చేశారన్నది అభియోగం. అప్పట్లో పోలీసులు ఇతనితోపాటు మొత్తం 12 మందిపై కేసు నమోదు చేసి కోర్టుకు నివేదించారు. ఈ కేసు విచారణకు అప్పటి ప్రభుత్వం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసింది. ఐదేళ్లపాటు కేసు విచారించిన ప్రత్యేక కోర్టు ప్రహ్లాద్‌ లోథిని దోషిగా నిర్థారిస్తూ రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

ఈ తీర్పు నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ ఎస్‌.పి.ప్రజాపతి ఓ ప్రకటన చేశారు. ‘కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రహ్లాద్‌ లోథి సభ్యత్వం రద్దయింది. అసెంబ్లీలో ఓ స్థానం ఖాళీ అయింది. ఈ విషయాన్ని ఎన్నిక కమిషన్‌ దృష్టికి కూడా తీసుకువెళ్లాం’ అని తెలిపారు. కాగా, లోథీ సభ్యత్వం రద్దుపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాకేష్‌సింగ్‌ మండిపడ్డారు.

అసెంబ్లీ సభ్యత్వాన్ని స్పీకర్‌ రద్దుచేయడం రాజ్యాంగ వ్యతిరేకమని, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని తప్పుబట్టారు. స్పీకర్‌ పూర్తిగా కాంగ్రెస్‌ మనిషిలా వ్యవహరించి ఆ పార్టీ ప్రతీకార చర్యకు సాయపడ్డారని విమర్శించారు. ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్‌ చేయనున్నట్లు ప్రకటించారు.

More Telugu News