RPI: సున్నా అనుభవం ఉన్న ఆదిత్య థాకరే సీఎం కావాలనుకోవడం మనందరికీ సిగ్గు చేటు: రాందాస్ అథవాలే

  • బీజేపీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలున్నారనే విషయాన్ని శివసేన గుర్తుంచుకోవాలి
  • సీఎంగా ఫడ్నవిస్ కు మరో అవకాశం ఇవ్వాలి
  • శివసేనకు డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చే అంశాన్ని బీజేపీ పరిశీలించాలి

50-50 ఫార్ములా ప్రకారం తమకు రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని శివసేన పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ మిత్రపక్షమైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధినేత, కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరేకు ఎలాంటి అనుభవం లేదని... అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలనుకోవడం మనందరికీ సిగ్గు చేటని అన్నారు.

బీజేపీకి చెందిన వ్యక్తే సీఎం కావాలని రాందాస్ చెప్పారు. దేవేంద్ర ఫడ్నవిస్ కు సీఎంగా మరో అవకాశం ఇవ్వాలని అన్నారు. మహారాష్ట్రలో బీజేపీ-శివసేనలు ఉన్న కూటమికి క్లియర్ మెజార్టీ వచ్చిందని... బీజేపీ శాసనసభాపక్ష నేతగా పడ్నవిస్ ను ఎన్నుకున్నారని చెప్పారు. ఫడ్నవిస్ సీఎం కావాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రానికి ఇద్దరు సీఎంలు కావాలని తాము కోరుకోవడం లేదని... ఐదేళ్ల పాటు ఒకే ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు.

బీజేపీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే విషయాన్ని శివసేన గుర్తుంచుకోవాలని అథవాలే చెప్పారు. ఇతర పదవుల కోసం శివసేన డిమాండ్ చేయవచ్చని... ఆ పార్టీకి డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చే అంశంపై బీజేపీ ఆలోచించాలని సూచించారు. మరో ఐదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉండబోతున్నట్టు ఫడ్నవిస్ ఇప్పటికే ప్రకటించారని... ఈ నేపథ్యంలో, శివసేన రాజీ పడాల్సిన అవసరం ఉందని చెప్పారు.

More Telugu News