Chandrababu: పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ లో చంద్రబాబుతో బీజేపీ వేదికను పంచుకోదు: విష్ణువర్ధన్ రెడ్డి

  • చంద్రబాబును రాష్ట్రంలో ఏ పార్టీ నమ్మడం లేదు
  • పవన్ ను ముందు పెట్టి చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారు
  • టీడీపీని దూరం పెడితేనే జనసేనను ప్రజలు నమ్ముతారు

ఇసుక కొరత వల్ల ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికుల తరపున పోరాడేందుకు ఈ నెల 3న జనసేన లాంగ్ మార్చ్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మార్చ్ లో విపక్షాలన్నీ పాల్గొనాలని జనసేనాని పవన్ కల్యాణ్ కోరారు. మరోవైపు, ఈ మార్చ్ లో తాము పాల్గొనబోమని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.

విశాఖలో జరిగే పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ లో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి బీజేపీ వేదికను పంచుకోదని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. టీడీపీ హయాంలో ఇసుకను, ఇతర వనరులను ఆ పార్టీ నేతలు దోచేశారని విమర్శించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఆందోళనలు చేస్తే ప్రజలు నమ్మరని అన్నారు. టీడీపీని జనసేన దూరం పెడితేనే ప్రజలు ఆ పార్టీని నమ్ముతారని చెప్పారు.

చంద్రబాబును రాష్ట్రంలో ఏ పార్టీ నమ్మడం లేదని... అందుకే పవన్ కల్యాణ్ ను ముందు పెట్టి చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని విష్ణు మండిపడ్డారు. బీజేపీని చంద్రబాబు ఒకటి, రెండు సార్లు మోసం చేయొచ్చు కాన్నీ ప్రతిసారీ మోసం చేయలేరని అన్నారు. జనసేన ఆందోళన వెనుక చంద్రబాబు అనైతిక రాజకీయ ముసుగు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ఇసుక సమస్యపై బీజేపీ పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. అందుకే ఇసుక సమస్యకు బీజేపీ సంఘీభావం తెలిపిందని చెప్పారు. ప్రజల పక్షాన బీజేపీ పోరాడుతుందే తప్ప, నాయకుల పక్షాన కాదని తెలిపారు.

More Telugu News