Kadapa District: ప్రేమ వివాహం చేసుకున్న జంట ఆత్మహత్యాయత్నం.. యువతి మృతి!

  • కడప జిల్లా జమ్మలమడుగులో ఘటన
  • పెద్దలకు తెలియకుండా ఆలయంలో పెళ్లి
  • చావుబతుకుల మధ్య ప్రేమికుడు

పెద్దలకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట.. ఇంటికి వెళితే ఏం జరుగుతుందోనని భయపడి ఆత్మహత్యకు యత్నించింది. ఈ క్రమంలో ప్రియురాలు ప్రాణాలు కోల్పోగా, ప్రియుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కడప జిల్లాలోని జమ్మలమడుగులో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం..

కడపలోని పెద్దదర్గాకు చెందిన భార్గవి, చిన్నచౌక్‌ బుడ్డాయపల్లెకు చెందిన భోగ శ్రీనివాసులు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. రెండు రోజుల క్రితం కర్నూలు జిల్లా మహానందిలో వివాహం చేసుకున్నారు. తాము పెళ్లి చేసుకున్న విషయాన్ని ఫోన్‌లో తల్లిదండ్రులకు తెలియజేసి గురువారం ఇంటికి వస్తామని చెప్పారు.

భార్గవి చెప్పింది విన్న తల్లిదండ్రులు ఆగ్రహంతో ఆమెను తీవ్రంగా మందలించారు. దీంతో ఇంటికి వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని భయపడి నిన్న ఉదయం వారు ఇంటికి వెళ్లకుండా జమ్మలమడుగు మండలంలోని గండికోటకు వెళ్లారు. అనంతరం వెంట తెచ్చుకున్న పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించారు.

అపస్మారకస్థితిలో పడి ఉన్న వీరిని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి ఇద్దరినీ జమ్మలమడుగు ప్రభుత్వాసుత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భార్గవి మృతి చెందగా, శ్రీనివాసులు పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం శ్రీనివాసులును కడప తరలించినట్టు పోలీసులు తెలిపారు.  

More Telugu News