RBI: నా పదవీ కాలం పొడిగిస్తే పరిస్థితి వేరుగా ఉండేది: ఆర్బీఐ మాజీ గవర్నర్ రాజన్

  • ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శకు రాజన్ దీటైన జవాబు
  • మీ హయాంలో ఎక్కువ కాలం పనిచేశానంటూ వ్యాఖ్యలు
  • యూపీఏ హయాంలో కేవలం 8 నెలలు మాత్రమేనని వెల్లడి

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా యూపీఏ హయాంలో కేవలం 8 నెలలు మాత్రమే పనిచేశానని, ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 26 నెలలపాటు ఆ పదవిలో ఉన్నానని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. బ్యాంకింగ్ రంగ సంస్కరణలు మొదలుపెట్టినప్పటికీ అవి మధ్యలో ఉండగానే తాను గవర్నర్ పదవినుంచి వైదొలగానని చెప్పారు.

దేశంలో బ్యాంకింగ్ రంగం చతికిలపడటానికి కారణం యూపీఏ, అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అనుసరించిన విధానాలే కారణమని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన విమర్శలకు రాజన్ దీటుగా జవాబిచ్చారు.

సీఎన్ బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ  2013 సెప్టెంబర్ నుంచి 2016 సెప్టెంబర్ వరకు ఆర్బీఐ గవర్నర్ గా తన పదవీకాలం కొనసాగిందని, ఎక్కువ కాలం బీజేపీ ప్రభుత్వం కిందే పనిచేశానని పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగ ప్రక్షాళన తాను చేపట్టినప్పటికీ.. అవి అసంపూర్తిగా ఉండగానే గవర్నర్ గా వైదొలిగానని చెప్పారు. తన పదవీకాలం పొడిగించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదన్నారు.

More Telugu News