Gitanjali: సీనియర్ నటి గీతాంజలి మృతిపై బాలకృష్ణ స్పందన

  • గుండెపోటుతో మరణించిన సీనియర్ నటి
  • దిగ్భ్రాంతికి గురైన బాలకృష్ణ
  • తమ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉందని వెల్లడి

తెలుగు చిత్రసీమను తమ నటనతో సుసంపన్నం చేసిన నటీమణుల్లో గీతాంజలి ఒకరు. ఆమె గుండెపోటుతో మృతి చెందడం చిత్రపరిశ్రమలో విషాదం నింపింది. గీతాంజలి మరణంపై అగ్రనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. గీతాంజలి గారు చనిపోయారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. ఆమె కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

ఆమెకు తమ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉందని, తన తండ్రి ఎన్టీఆర్ అంటే గీతాంజలి గారు ఎంతో అభిమానం చూపేవారని వెల్లడించారు. ఆమె ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా పలకరించేవారని బాలయ్య గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన సీతారామ కల్యాణం చిత్రంలో గీతాంజలి సీత పాత్ర పోషించారని, నటనలో ఆమె ఎన్టీఆర్ నే స్ఫూర్తిగా తీసుకునేవారని వివరించారు. ఇప్పుడామె అందరినీ వదిలి వెళ్లిపోవడం అత్యంత బాధాకరమని వ్యాఖ్యానించారు.

More Telugu News