Kotamreddy: మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  • కొన్ని పత్రికలు, ఛానల్స్ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయి
  • చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకుని లోటు బడ్జెట్ చూపించారు
  • జగన్ పాలన సహించకే విమర్శలు చేస్తున్నారు

కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.

 ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.

మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.

 చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ 90 శాతం స్థానాలు గెలుచుకుంటుందని కోటంరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు విలువల గురించి మాట్లాడుతుంటే.. ఉగ్రవాదులు శాంతి వచనాలు పలికినట్లుందన్నారు.

More Telugu News