Tamilisai: మూడు నెలల్లో తెలుగు నేర్చుకుని మాట్లాడతా: తమిళిసై

  • మహిళా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన తమిళిసై
  • తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్
  • ప్రతి రంగాన్ని మహిళలు సవాల్ గా తీసుకుని ముందుకు సాగాలని పిలుపు

హైదరాబాద్ ముషీరాబాద్ లో జాగృతి ఫౌండేషన్ నిర్వహించిన మహిళా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగులో తన ఉపన్యాసాన్ని ప్రారంభించిన ఆమె... మూడు నెలల్లో తెలుగు నేర్చుకుని, మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. మహిళలు ప్రతి రంగాన్ని సవాల్ గా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మహిళలు తమకు నచ్చిన ఏదో ఒక రంగాన్ని ఎంచుకుని, అందులో నైపుణ్యతను సాధించాలని చెప్పారు. ముఖ్యంగా ఆరోగ్యంపై మహిళలు శ్రద్ధ చూపాలని సూచించారు.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తో కలిసి ధ్రువపత్రాలను తమిళిసై అందించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, ఇక్కడ శిక్షణ పొందిన మహిళలు ముద్ర రుణాలు తీసుకోవచ్చని చెప్పారు. శిక్షణ పొందిన వారంతా ఇతర మహిళలు కూడా శిక్షణ పొందేలా ప్రోత్సహించాలని కోరారు.

More Telugu News