Jamuna: జమునకి కోపం రావడం వల్లనే ఆమె 'ఆత్మకథ' ఆగిపోయిందట!

  • 'విజయచిత్ర'లో జమునగారి ఆత్మకథ ప్రచురించేవాళ్లం 
  •  అన్ని విషయాలను ఆమె ఆసక్తికరంగా చెప్పేవారు 
  • తమ నిర్ణయం జమునగారికి కోపం తెప్పించిందన్న ఈశ్వర్

తెలుగు తెరపై సావిత్రి తరువాత కనిపించే పేరు .. వినిపించే పేరు జమున. అందానికి .. అభినయానికి నిర్వచనం చెప్పిన జమున, అనేక విజయవంతమైన చిత్రాల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తాజాగా ఆమెను గురించి సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ మాట్లాడారు.

"చెన్నైలో 'విజయ చిత్ర' పత్రికలో నేను ఉప సంపాదకుడిగా చేస్తున్న రోజులవి. మా పత్రికలో జమునగారి 'ఆత్మకథ'ను సీరియల్ గా ప్రచురిస్తున్నాము. అన్ని విషయాలను ఆమె ఎంతో ఆసక్తికరంగా చెప్పేవారు. ఒక రోజున మేటర్ కోసం ఆమె ఇంటికి వెళితే, 'దొంగల్లో దొర' సినిమా సమయంలో జరిగిన సంఘటన, తనని ఎన్టీఆర్ .. ఏఎన్నార్ లు పక్కన పెట్టేసిన తీరును ఆ సీరియల్లో ప్రచురించమని ఆమె అడిగారు.

అయితే, అది చాలా వివాదాస్పదమైన విషయం కనుక ప్రచురించలేదు. దాంతో జమునగారికి కోపం వచ్చేసింది. ఇకపై ఈ సీరియల్ ను కొనసాగించడం తనకి ఇష్టం లేదన్నట్టుగా మాట్లాడారు. దాంతో ఆమె 'ఆత్మకథ' సీరియల్ అర్ధాంతరంగా ఆగిపోయింది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News