West Bengal: కమ్యూనిస్టు కురువృద్ధుడు గురుదాస్‌ దాస్‌గుప్తా కన్నుమూత

  • కోల్‌కతాలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచిన సీపీఐ నేత
  • గత కొన్నిరోజులుగా ఊపితిత్తులు, మూత్రపిండాల వ్యాధులతో సతమతం
  • రెండున్నర దశాబ్దాల పాటు పార్లమెంటేరియన్‌గా సేవలు

సుమారు రెండున్నర దశాబ్దాల పాటు పార్లమెంటేరియన్‌గా సేవలందించిన కమ్యూనిస్టు కురువృద్ధుడు, సీపీఐ సీనియర్‌ నాయకుడు గురుదాస్‌ దాస్‌గుప్తా (83) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధులతో సతమతమవుతున్న గురుదాస్‌ ఈరోజు ఉదయం కోల్‌కతాలోని భవానీపూర్ లో ఉన్న తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య జయశ్రీ దాస్ గుప్తా, ఓ కుమార్తె ఉన్నారు. గురుదాస్ ప్రస్తుతం బంగ్లాదేశ్ లో భాగంగా ఉన్న బారిసలా ప్రాంతంలో 1936 నవంబరు 3న జన్మించారు.

పోరాట యోధుడిగా, వాక్చాతుర్యం ఉన్న నేతగా పేరున్న గురుదాస్‌ దాస్‌గుప్తా రచయిత కూడా. ‘సెక్యూరిటీస్‌ స్కాండల్‌- ఏ రిపోర్ట్‌ టు ది నేషన్‌’ అన్న పుస్తకాన్ని ఆయన రాశారు. 1985 (మూడేళ్ల కాలపరిమితి), 1988, 1994లో రాజ్యసభకు ఎంపికైన ఆయన 2004లో పంక్‌సురా నియోజకవర్గం నుంచి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగి గెలుపొందారు.

2009లో ఘాటల్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 15వ సభలో సీపీఐ లోక్‌సభా పక్షం నేతగా కూడా పనిచేశారు. 2001లో ఆలిండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ (ఏఐటీయూసీ) అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 2జీ స్ప్రెక్ట్రం కుంభకోణంపై ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా కూడా నియమితులయ్యారు.

More Telugu News