telecom: మొబైల్ వినియోగదారులకు షాక్.. ఇక ఫ్రీ కాల్స్, డేటా లేనట్టే?

  • కష్టాల్లో టెలికం కంపెనీలు
  • ప్రభుత్వానికి రూ. 92,500 కోట్ల బకాయిలు
  • కాల్స్, డేటాలకు కనీస చార్జీలను సిద్ధం చేస్తున్న ట్రాయ్?

టెలికం రంగంలో జియో ప్రవేశం తర్వాత ఆ రంగం స్వభావమే మారిపోయింది. ఉచిత కాల్స్, డేటాతో వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంది. అప్పటి వరకు కాల్స్‌కు, డేటాకు వేర్వేరుగా రీచార్జ్‌లు చేసుకునే వినియోగదారులకు ఆ అవకాశమే లేకుండా పోయింది. ఒకసారి రీచార్జ్ చేసుకుంటే ఇక అన్నీ ఉచితమే అన్న జియో ప్లాన్లు వినియోగదారులను కట్టిపడేశాయి. ఫలితంగా అనతికాలంలోనే జియో అగ్రస్థానికి చేరుకుంది.

ఇక జియో రాకతో ఇతర టెలికం కంపెనీలు కష్టాలు ఎదుర్కొన్నాయి. అవి కూడా జియో దారికి రాక తప్పలేదు. ఖాతాదారులను నిలబెట్టుకునేందుకు అవి కూడా 'ఫ్రీ'లు ప్రకటించక తప్పలేదు. మరోవైపు అప్పుల్లో కూరుకుపోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న టెలికం కంపెనీలు ఇప్పుడు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికంకు ఏకంగా రూ. 92,500 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. దీంతో తమను కష్టాల నుంచి బయటపడేయాలంటూ ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గుబా ఆధ్వర్యంలో కార్యదర్శుల స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.  

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీ టెలికం సంస్థల ఆదాయం పెరిగే మార్గాలను అన్వేషించనుంది. అలాగే, ఉచిత ఆఫర్లను వెనక్కి తీసుకోవాలన్న ప్రతిపాదనను కూడా చేయనున్నట్టు సమాచారం. కంపెనీల ఆదాయానికి గండికొట్టే ఇటువంటి వాటికి ఇక చెక్ పెట్టడం ద్వారా కంపెనీలను కష్టాల ఊబి నుంచి బయట పడేయవచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి సమర్పించే నివేదికలో ఈ విషయాన్ని పేర్కొనే అవకాశం ఉందని తెలుస్తోంది. బెయిలవుట్ ప్యాకేజీ కింద టెలికం సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు సూచనలు చేయవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు,  ఫోన్‌ కాల్స్, డేటా సర్వీసులకు కనీస చార్జీలను ప్రకటించే అంశాన్ని ట్రాయ్ పరిశీలిస్తోంది.

ఇక కష్టాల్లో కూరుకుపోయిన టెలికం కంపెనీలు ప్రభుత్వం నుంచి కొన్ని ఉపశమన చర్యలు ఆశిస్తున్నాయి. అందులో మొదటిది యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ తప్పనిసరిగా ఇవ్వాల్సిన వాటాను తగ్గించాలని, స్పెక్ట్రం చెల్లింపులపై రెండేళ్ల పాటు అంటే.. మార్చి 2022 వరకు మారటోరియం ఉండాలని కంపెనీలు భావిస్తున్నాయి. అలాగే లైసెన్స్ ఫీజును ఎనిమిది శాతం నుంచి మూడు శాతానికి తగ్గించాలని కోరుతున్నాయి.

More Telugu News