GOLD: చెత్తతోపాటు పడేసిన 40 గ్రాముల బంగారం... దాన్ని మింగేసిన ఎద్దు!

  • జరిగిన పొరపాటు తెలుసుకున్న ఇంటి యజమాని
  • సీసీ కెమెరా పుటేజీలో గుర్తించి ఎద్దు స్వాధీనం
  • పేడవేస్తే తమ వస్తువులు దొరుకుతాయని ఎదురు చూపు

పొరపాటున చెత్తతోపాటు పడేసిన దాదాపు లక్షన్నర విలువ చేసే బంగారాన్ని ఓ ఎద్దు తినేసింది. ఇప్పుడా బంగారం యజమానులు ఆ ఎద్దు పేడ వేస్తే అందులో వెదుక్కునేందుకు ఎదురు చూస్తున్నారు.

వివరాల్లోకి వెళితే... హర్యానాలోని సిర్సాకు చెందిన జనక్‌రాజ్‌ భార్య, కోడలు తమ 40 గ్రాముల బంగారం నగలను వంట గదిలోని ఓ గిన్నెలో భద్రపరిచారు. అనంతరం అదే గిన్నెలో చెత్తను పడేశారు. గిన్నెలో చెత్త కింద తమ బంగారం ఉన్న విషయాన్ని అత్తాకోడళ్లు మర్చిపోయారు. ఆ తర్వాత చెత్తను తీసుకువెళ్లి బయటపడేయగా ఓ ఎద్దు చెత్తతోపాటు బంగారాన్ని మింగేసింది.

ఆ తర్వాత నగల విషయం గుర్తుకు వచ్చిన కుటుంబ సభ్యులు సీసీ కెమెరా పుటేజీ పరిశీలించగా ఎద్దు తినేయడాన్ని గుర్తించారు. దీంతో ఆ ఎద్దును పట్టుకుని ప్రస్తుతం దాన్ని సాకుతున్నారు. ఈపూటా, ఆపూటా ఆహారం పెట్టి అది వేసే పేడలో తమ వస్తువులు పడతాయేమోనని ఎదురు చూస్తున్నారు.

ఈనెల 19వ తేదీన ఈ ఘటన జరగగా, ఇప్పటి వరకు ఎద్దు వేసిన పేడలో వారి వస్తువుల జాడ కనిపించక పోవడంతో నిరాశ చెందుతున్నారు.

More Telugu News