Hyderabad: హైదరాబాద్ లో పెరిగిన వాయు కాలుష్యం

  • దీపావళి రోజు బాణసంచా కాల్చడంతో ప్రమాదకర స్థాయికి కాలుష్యం
  • సనత్ నగర్ లో అత్యధిక కాలుష్యం నమోదు
  • గత  ఏడాదితో పోల్చితే ఈ ఏడాది పెరిగిన కాలుష్యం

హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం దీపావళి సందర్భంగా తారస్థాయికి చేరింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) పండగ అనంతరం నగరంలో గాలి నాణ్యతపై నివేదిక విడుదల చేసింది. గత ఏడాది దీపావళి రోజు నమోదైన వాయు కాలుష్యం కంటే ఈ ఏడాది కాలుష్యం పెరిగిందని తెలిపింది. గత ఏడాది కాలుష్యం 622 మైక్రో గ్రాములుగా ఉండగా, ఈ ఏడాది అది 830 మైక్రో గ్రాములకు చేరిందని వెల్లడించింది.

పారిశ్రామిక ప్రాంతమైన సనత్ నగర్ లోని ప్రజలు నివసించే ప్రాంతాల్లో అత్యధిక కాలుష్యం నమోదైందని పేర్కొంది. కాలుష్య నియంత్రణపై సుప్రీంకోర్టు ఆదేశాలపై రాష్ట్ర పీసీబీ ఏటేటా  గాలి నాణ్యతను పరిశీలిస్తోంది. శనివారం వాయు నాణ్యత సూచిక(ఏక్యూఐ) 65 నుంచి 80 మధ్య ఉండగా అదివారం సాయంత్రం నాటికి అది 240కు చేరింది. సనత్ నగర్ లో పండగరోజు సాయంత్రం నాటికి 720 మైక్రో గ్రాములకు చేరింది. గాలిలో ఏక్యూఐ 300 దాటితే ప్రమాదకరంగా పీసీబీ చెబుతోంది. దీనిప్రకారం నగరంలో చాలా చోట్ల ఈ పరిమితి దాటిపోయిందని పీసీబీ ఆందోళన వ్యక్తం చేసింది.

More Telugu News