Devendra Fadnavis: బీజేపీ నేతృత్వంలోనే స్థిరమైన సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఉంటుంది!: ఫడ్నవీస్ స్పష్టీకరణ

  • పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలన్న  ఒప్పందం ఏమీ లేదు
  • స్థిరమైన, సమర్థవంతమైన సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుంది
  • శివసేనకు సీఎం పదవి ఇవ్వాలని ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు 

మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలని బీజేపీని శివసేన డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ స్పందించారు. మరో ఐదేళ్ల పాటు బీజేపీ నేతృత్వంలోనే సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలన్న ఫార్ములాపై ఒప్పందం ఏమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలో స్థిరమైన, సమర్థవంతమైన సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుందని స్పష్టం చేశారు. శివసేనకు సీఎం పదవి ఇవ్వడంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తమ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలిపారని ఆయన అన్నారు.

కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి బీజేపీ, శివసేన కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. బీజేపీకి ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన ఆధిక్యం రాకపోవడంతో  సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలన్న డిమాండ్ ను శివసేన తీసుకొచ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవుతోంది. 288 అసెంబ్లీ స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56 సీట్లను గెలుచుకున్నాయి.

More Telugu News