Vallabhaneni Vamsi: వల్లభనేవి వంశీనే కాదు.. మరో టీడీపీ నేత కూడా బీజేపీ, వైసీపీని సంప్రదిస్తున్నారు: బీజేపీ నేత రఘురాం

  • గంటా శ్రీనివాసరావు బీజేపీ, వైసీపీలను సంప్రదిస్తున్నారు
  • వైసీపీ బెదిరింపులు ఉండే నేతలకు బీజేపీ అండగా ఉంటుంది
  • మచ్చ లేని నేతలు బీజేపీలోకి రావచ్చు

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ నేత రఘురాం మరో బాంబు పేల్చారు. వల్లభనేని వంశీతో పాటు టీడీపీ మరో నేత గంటా శ్రీనివాసరావు కూడా బీజేపీ, వైసీపీని సంప్రదిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, వైసీపీతో చర్చించే వంశీ రాజీనామా చేశారని తెలిపారు. వైసీపీ బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని... బెదిరింపులు ఉండే నేతలకు బీజేపీ అండగా ఉంటుందని... మచ్చ లేని నేతలు తమ పార్టీలోకి రావచ్చని స్వాగతించారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో వైసీపీ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఏపీలో ప్రస్తుతానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ... భవిష్యత్తు బీజేపీదేనని రఘురాం అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం పార్టీలు మారేవారిని ప్రజలు నమ్మరని చెప్పారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి జగన్ ల భేటీలో ఏం జరిగిందో తనకు తెలియదని స్పష్టం చేశారు.

More Telugu News