Cricket: నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసి, 75 పరుగులిచ్చి.. చెత్త రికార్డును నమోదు చేసిన శ్రీలంక ఆటగాడు

  • అడిలైడ్ లో ఆస్ట్రేలియా, శ్రీలంకకు మధ్య టీ20
  • టీ20ల్లో ఇదే అత్యంత చెత్త ప్రదర్శన
  • ఆసీస్ 134 పరుగుల తేడాతో గెలుపు

నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసి ఏకంగా 75 పరుగులిచ్చి శ్రీలంక ఆటగాడు కసున్‌ రజిత చెత్త రికార్డును నమోదు చేశాడు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ లో ఆస్ట్రేలియా, శ్రీలంకకు మధ్య  మూడు టీ20ల సిరీస్‌ జరుగుతోంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌లో రజిత... తాను వేసిన మొదటి ఓవర్‌లో 11 పరుగులు, రెండో ఓవర్‌లో 21 పరుగులు, మూడో ఓవర్‌లో 25 పరుగులు, నాలుగో ఓవర్‌లో 18 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు. టీ20ల్లో ఇదే అత్యంత చెత్త ప్రదర్శనగా నిలిచింది.

అడిలైడ్ లో జరిగిన ఈ టీ20లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా.. శ్రీలంకకు 234 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ను  శ్రీలంక బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. మైదానంలో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ పరుగుల వరద పారించారు. వార్నర్‌, కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌, మ్యాక్స్‌వెల్‌ అద్భుత ప్రదర్శనతో శ్రీలంక ముందు ఆస్ట్రేలియా భారీ లక్ష్యాన్ని ఉంచింది. శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 99 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఆసీస్ 134 పరుగుల తేడాతో విజయం సాధించింది.

More Telugu News