bihar: రెండో ప్రియుడితో కలిసి మొదటి ప్రియుడిని లేపేసిన మహిళ!

  • బీహార్‌లోని ముంగేర్ జిల్లాలో ఘటన
  • ఐదేళ్ల సహజీవనం తర్వాత మరో యువకుడితో వెళ్లిపోయిన మహిళ
  • తిరిగి రమ్మన్నందుకు హత్య

రెండో ప్రియుడితో కలిసి మొదటి ప్రియుడిని దారుణంగా చంపేసిందో మహిళ. బీహార్‌లోని ముంగేర్ జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 5 నుంచి తన కుమారుడు కరణ్‌కుమార్ కనిపించడం లేదంటూ అతడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కరణ్ కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం టెంటియా బంబర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని ఓ పొలంలో కరణ్‌ మృతదేహం లభ్యమైంది.

మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఘటనా స్థలంలోనే లభించిన అతడి సెల్‌ఫోన్‌లో కాల్‌డేటాను పరిశీలించారు. అతడికి చివరిగా రవీనా అనే మహిళ కాల్ చేసినట్టు నిర్ధారించుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఆమె చెప్పిన విషయాలు పోలీసులను విస్మయానికి గురిచేశాయి.

రవీనా, కరణ్‌కుమార్‌లు ఐదేళ్లపాటు సహజీవనం చేశారు. అయితే, ఆ తర్వాత రవీనాకు పాశ్వాన్ అనే మరో యువకుడు పరిచయమయ్యాడు. దీంతో కరణ్‌కు దూరమైన రవీనా అతడితో వెళ్లిపోయింది. గత నాలుగేళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో రవీనాతో గొడవ పడిన మొదటి ప్రియుడు కరణ్ తన వద్దకు రావాలంటూ రవీనాపై ఒత్తిడి తీసుకొచ్చాడు. తాను రానని చెప్పినా అతడు వినిపించుకోలేదు. దీంతో అతడిని అడ్డుతొలగించుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చింది. ప్రియుడికి విషయం చెప్పి అతడిని హత్య చేయాలని నిర్ణయించుకుంది.

ప్లాన్‌లో భాగంగా కరణ్‌కు ఫోన్ చేసిన రవీనా మాట్లాడుకుందాం రమ్మంటూ ఆహ్వానించింది. నిజమేనని నమ్మిన కరణ్ ఆమె చెప్పిన చోటుకు వెళ్లాడు. అప్పటికే అక్కడ కాపుకాసిన పాశ్వాన్, అతడి స్నేహితులు  కుమార్, రవి, సోనూకుమార్‌‌తో కలిసి అతడిపై దాడిచేసి దారుణంగా చంపేసినట్టు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో రవీనా తెలిపింది. దీంతో పాశ్వాన్ సహా అతడి స్నేహితులు ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News