Yanam: అదృశ్యమైన రెండు నెలల తరువాత... సొంత ఇంట్లోనే విగతజీవిగా యానాం వాసి!

  • కనిపించకుండా పోయాడని ఫిర్యాదు
  • ఇంట్లోనే శిథిల స్థితిలో అస్థి పంజరం
  • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

ఇంట్లో నుంచి కనిపించకుండా పోయాడని భావించిన ఓ వ్యక్తి, రెండు నెలల తరువాత ఇంట్లోనే శవమై కనిపించిన ఘటన యానాంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, పట్టణంలోని టైడల్‌ లాకులకు దగ్గర్లో ఉన్న ఓల్డ్‌ రాజీవ్‌ నగర్‌ ప్రాంతంలో నివశిస్తున్న నల్లి చిట్టిబాబు (50) రెండు నెలల క్రితం కనబడకుండా పోయాడు. ఈ మేరకు ఆయన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు కూడా నమోదైంది. చిట్టిబాబు కోసం పోలీసులు వెతికినా ప్రయోజనం లేకపోయింది.

ఈ నేపథ్యంలో శనివారం నాడు చిట్టిబాబు ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో, సమాచారం అందుకున్న పోలీసులు, ఇంటి తలుపులను పగులగొట్టి చూడగా, శిథిల స్ధితిలో ఉన్న అస్థి పంజరం ఒకటి కనిపించింది. మృతదేహాన్ని పరిశీలించిన చిట్టిబాబు బంధువులు అది కనిపించకుండా పోయిన చిట్టిబాబుదేనని గుర్తించారు. మృతుడు అవివాహితుడని, ఒక్కడే ఇంట్లో ఉంటున్న కారణంగా, ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళతారో ఇరుగు, పొరుగు వారికి తెలియదని, అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

More Telugu News