Tamilnadu: బీజేపీలో పార్టీ విలీనంపై స్పందించిన టీఎంసీ చీఫ్ జీకే వాసన్

  • ఆ వార్తలు వదంతులు మాత్రమే
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలకు ఆదరణ ఉంది
  • త్వరలో కుంభకోణం కేంద్రంగా కొత్త జిల్లా

తమిళ మానిల కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ బీజేపీలో విలీనం కాబోతోందంటూ వస్తున్న వార్తలపై ఆ పార్టీ చీఫ్ జీకే వాసన్ స్పందించారు. కుంభకోణంలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. విలీనం వార్తలను కొట్టిపడేశారు. అవి వదంతులు మాత్రమేనని తేల్చిచెప్పారు. తంజావూరులో బీజేపీ నిర్వహించిన చర్చా వేదికలో తమ పార్టీ ప్రతినిధులు పాల్గొనడంతో ఈ వదంతులు వ్యాపించాయన్న ఆయన వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు.

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆదరణ బాగుందన్న విషయం ఉప ఎన్నికలతో నిరూపితమైందని వాసన్ పేర్కొన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కుంభకోణం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు కానుందన్న ఆయన.. పంట భీమా పథకంలో రైతులకు అందిస్తున్న పరిహారాన్ని నేరుగా వారికే అందించాలని వాసన్ డిమాండ్ చేశారు.

More Telugu News