Nalgonda District: కొడుకును తన వద్దకు పంపాలన్న భర్త.. యాసిడ్ తాగించి చంపేసిన భార్య

  • విభేదాల కారణంగా భర్తకు దూరంగా ఉంటున్న భార్య
  • దీపావళికి కుమారుడిని పంపమన్న భర్త
  •  పంపడం ఇష్టం లేక హత్య

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. భర్తతో విభేదాల కారణంగా అతడికి దూరంగా ఉంటున్న మహిళ.. ఐదేళ్ల కుమారుడికి యాసిడ్ తాగించి ప్రాణాలు తీసింది. ఆపై భయంతో తానూ యాసిడ్ తాగింది. ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. చింతపల్లి మండలంలోని పర్కాలకు చెందిన శివరాణి, నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలోని బెక్కెరకు చెందిన పోతుల శివరెడ్డి భార్యాభర్తలు. వీరికి ఐదేళ్ల కుమారుడు యశ్వంత్‌రెడ్డి ఉన్నాడు.

ఇటీవల వీరిమధ్య భేదాభ్రియాలు తలెత్తడంతో శివరాణి తన కుమారుడిని తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. శివరాణి తల్లిదండ్రులు ఇటీవల ఆమె పేరుపై ఐదెకరాల ఆస్తిని రాసిచ్చారు. విషయం తెలిసిన భర్త శివరెడ్డి ఆ భూమిని విక్రయించి డబ్బులు ఇవ్వాల్సిందిగా భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఇటీవల భార్యకు ఫోన్ చేసిన శివరెడ్డి దీపావళికి ఇంటికి రావాల్సిందిగా కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో కనీసం యశ్వంత్‌నైనా పంపాలని గొడవపెట్టుకున్నాడు.

దీనికి కూడా నిరాకరించిన శివరాణి.. అవసరమైతే కుమారుడిని చంపుకుంటాను కానీ పంపేది లేదని తెగేసి చెప్పింది. శుక్రవారం రాత్రి టాయిలెట్లను శుభ్రం చేసే యాసిడ్ తాగించి పడుకోబెట్టింది. శనివారం ఉదయం చూసే సరికి యశ్వంత్ విగతజీవిగా కనిపించడంతో భయంతో వణికిపోయింది. ఏం చేయాలో పాలుపోక ఆమె కూడా యాసిడ్ తాగి పోలీస్ కంట్రోలు రూముకు సమాచారం అందించింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శివరాణిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News