BJP: ఆత్మగౌరవం ఉన్న ప్రతీ మహిళ మొదట చేయాల్సింది ఇదే: ప్రియాంక గాంధీ పిలుపు

  • మహిళలంటే ఆ పార్టీ నేతలకు గౌరవం లేదు
  • అత్యాచారాలు చేసి అరెస్ట్ అవుతున్నారు
  • బీజేపీపై విరుచుకుపడిన ప్రియాంక

ఆత్మగౌరవం ఉన్న ప్రతీ భారత మహిళ బీజేపీని, ఆ పార్టీ నేతలను బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంకగాంధీ పిలుపునిచ్చారు. మహిళలంటే ఆ పార్టీ నేతలకు గౌరవం లేదన్న ప్రియాంక.. వారిని దూరంగా పెట్టాలన్నారు. బీజేపీ నేతలు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కుల్దీప్‌సింగ్ సెంగార్, స్వామి చిన్మయానంద, గోపాల్ కందా.. వీరందరూ మహిళలను వేధించిన వారేనని ఆరోపించారు. ఇటువంటి వారిని బహిష్కరించాలని మహిళల కోరారు.

ఉన్నావో బాలికపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ అరెస్టయ్యాక ఆయనను బీజేపీ సస్పెండ్ చేసిందని, ఆ తర్వాత స్వామి చిన్మయానంద కూడా ఇదే తరహా కేసులో అరెస్టయ్యారని పేర్కొన్నారు. తన విమానయాన సంస్థలో పనిచేస్తున్న ఎయిర్‌హోస్టెస్ ఆత్మహత్యకు గోపాల్ కందా కారణమన్న ఆరోపణలు ఉన్నాయని ప్రియాంక అన్నారు. ఆ తర్వాత కొన్ని నెలలకే ఆమె తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. కాగా, ప్రస్తుతం గోపాల్ కందా మద్దతుతోనే హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ నేపథ్యంలో ప్రియాంక చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

More Telugu News