Tsrtc: ఆర్టీసీ సమ్మె అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళతాం: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్

  • ఆర్టీసీ ఆస్తులపై టీఆర్ ఎస్ నేతల కన్నుపడింది
  • నిర్భయంగా సమ్మె కొనసాగించాలని పిలుపు
  • ఆర్టీసీ కార్మికుల ప్రతీ కార్యక్రమానికి మా మద్దతు 

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఆర్టీసీ ఆస్తులపై తెలంగాణ రాష్ట్ర సమితి నేతల కన్నుపడిందని పేర్కొన్నారు. ఆర్టీసీ ఆస్తులను కాపాడటమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో లక్ష్మణ్ భేటీ అయ్యారు. ఆర్టీసీ సమ్మె, తదుపరి కార్యాచరణపై జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డితో చర్చలు జరిపారు.

అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ, వేల కోట్ల ఆర్టీసీ ఆస్తులను సొంతం చేసుకోవడానికి టీఆర్ ఎస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను భగ్నం చేస్తామన్నారు. కార్మికులు నిర్భయంగా, ప్రజాస్వామ్యయుతంగా సమ్మె కొనసాగించాలని, తాటాకు చప్పుళ్లకు బెదరవద్దని,  అవసరమైతే ఉద్యమాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకుపోతామని అన్నారు. బీజేపీకి ఓటములు కొత్త కాదని, ఎన్నో ఓటముల తర్వాతే కేంద్రంలో తమ పార్టీ వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిందని ఆయన చెప్పారు.

More Telugu News