India: పీవోకే ద్వారా చొరబడిన ఉగ్రవాదులు.. ఆత్మాహుతి దాడులకు ప్రణాళిక.. నిఘా వర్గాల హెచ్చరిక

  • ఎన్ఐఏ కార్యాలయం, సీజీవో కాంప్లెక్స్ పై దాడికి ప్రణాళిక
  • ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం, అగ్రనేతలపై గురి
  • ఆయా శాఖలను అప్రమత్తం చేసిన కేంద్ర హోం శాఖ

దేశంలో ఆత్మాహుతి దాడులకు ఉగ్రవాదులు ప్రణాళికలు రచించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఈ మేరకు పోలీసులను కేంద్ర హోం శాఖ అప్రమత్తం చేసింది. దేశంలోని పలు సంస్థలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు ప్రణాళికలు వేసుకున్నట్లు నిఘా వర్గాలు సమాచారం అందించాయి. ఢిల్లీలోని ఎన్ఐఏ కార్యాలయం, సీజీవో కాంప్లెక్స్ పై దాడి చేయాలని చూస్తున్నారు. అలాగే, ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంతో పాటు, ఆ సంఘ్ అగ్రనేతలపై దాడులు జరపాలని ఉగ్రవాదులు ప్రణాళిక వేసుకున్నారు.  

పోలీసు, పారామిలిటరీ శిక్షణా కేంద్రాలను లక్ష్యం చేసుకొని కూడా దాడులు చేయాలనుకుంటున్నారు. అప్రమత్తంగా ఉండాలని ఆయా విభాగాలను కేంద్ర హోం శాఖ ఆదేశించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన కారణంగా, అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఈ దాడులకు ఉగ్రవాదులు సిద్ధమయ్యారు. ఇప్పటికే పీవోకే ద్వారా చొరబాట్లు జరిగాయని నిఘా వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో దాడులు జరగొచ్చని అందిన సమాచారంతో అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు.

More Telugu News