Supreme Court: సుప్రీంకోర్టులో టెలికాం కంపెనీలకు చుక్కెదురు

  • టెలికాం కంపెనీలు రూ.92,641 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి వుంటుంది
  • ఈ నిర్ణయంతో టెలికాం పరిశ్రమ బలహీన పడుతుంది
  • ప్రభుత్వం పునరాలోచించాలన్న టెలికాం కంపెనీలు

సవరించిన స్థూల రాబడి (ఏజీఆర్) అంశంలో సుప్రీం కోర్టులో టెలికాం కంపెనీలకు చుక్కెదురయింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, ఎఎ.నజీర్, ఎంఆర్.షాలతో కూడిన ధర్మాసనం ప్రభుత్వంవైపే మొగ్గింది. కోర్టు తీర్పుతో టెలికాం కంపెనీలు రూ.92,641 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి వుంటుంది.

టెలికాం ఆపరేటర్లు లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రం చార్జీలను రాబడిలో నిర్ణీత వాటాగా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 85 శాతం టెలికాం పరిశ్రమ చెల్లించింది. మిగతా 15 శాతంపై (23,189 కోట్లు) టెలికాం కంపెనీలు, ప్రభుత్వానికి మధ్య వివాదం నెలకొంది. దీనిపై గతంలో టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు కోర్టుకు వెళ్లగా తొలుత తమ కనుకూలంగానే తీర్పు పొందాయి. తాజాగా ఇదే అంశంపై డీవోటీ సుప్రీంలో పిటిషన్ వేసింది. వడ్డీ, పెనాల్టీ, పెనాల్టీపై వడ్డీ కూడా చెల్లించాలని కోరింది. పిటిషన్ విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసంన డీవోటీ వాదనతో ఏకీభవించింది.

ఈరోజు  దీనిపై తీర్పుచెపుతూ వివాదాస్పద మొత్తం రూ.23,189 కోట్లుగా పేర్కొంటూ వడ్డీ చెల్లింపులు రూ.41,650 కోట్లు, పెనాల్టీ 10,923 కోట్లు, పెనాల్టీపై వడ్డీ రూ.16, 878 కోట్లను కూడా కలిపి మొత్తం రూ.92,641 కోట్లు డీవోటీకి చెల్లించాలని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పుపై ఎయిర్ టెల్ సంస్థ స్పందిస్తూ.. ఇది టెలికాం రంగాన్ని బలహీన పరిచే అవకాశముందని, ప్రభుత్వం దీనిపై మరోసారి ఆలోచించాలని కోరింది.

More Telugu News