Ambati Rambabu: వేల పుస్తకాలు చదివానని గొప్పలు చెప్పుకునే పవన్ కల్యాణ్ కు ఆ విషయం తెలియదా?: అంబటి ఫైర్

  • చంద్రబాబుతో కుమ్మక్కయ్యారంటూ వ్యాఖ్యలు
  • చంద్రబాబు డీఎన్ఏ, పవన్ డీఎన్ఏ ఒకటేనన్న అంబటి
  • సొంత పార్టీలో వలసలు ఆపుకోవాలంటూ పవన్ కు హితవు

జగన్ పై కేసులు విచారణలో ఉన్నప్పుడు నేరస్తుడు అనకూడదన్న విషయం వేల పుస్తకాలు చదివానని గొప్పలు చెప్పుకునే పవన్ కల్యాణ్ కు తెలియదా? అంటూ వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై జగన్ కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిస్తే దానిపై విమర్శలు చేయడం పవన్ కు సరికాదని హితవు పలికారు. చంద్రబాబుతో కుమ్మక్కైన పవన్ బరితెగించిపోయారని అంబటి వ్యాఖ్యానించారు. చంద్రబాబు డీఎన్ఏ, పవన్ డీఎన్ఏ ఒకటే కాబట్టి పిచ్చిపట్టినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ అని వ్యంగ్యం ప్రదర్శించారు.

ఎన్నికల్లో రెండు చోట్లా ఓటమిపాలైన పవన్ కు జగన్ గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. ప్రజలు ఎందుకు ఓడించారో పవన్ ఇప్పటికైనా తెలుసుకోవాలని, చంద్రబాబు వంటి వ్యక్తులను నమ్ముకుంటే ఫలితాలు అలాగే వస్తాయని వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లాలో ప్రజల వలసల గురించి మాట్లాడుతున్న పవన్ ముందు తన సొంత పార్టీలో వలసలను చూసుకోవాలని అంబటి చురకంటించారు.

More Telugu News