Errabelli: ఇది కేవలం హుజూర్ నగర్ ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు: మంత్రి ఎర్రబెల్లి

  • రాష్ట్ర ప్రజలంతా టీఆర్ఎస్ కు మద్దతు తెలుపుతున్నారు
  • కేసీఆర్ వెంటే ప్రజలు ఉన్నారు
  • ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలు సహించరు

తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా టీఆర్ఎస్ కు మద్దతు తెలుపుతున్నారని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఆధిక్యంతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. ఇది కేవలం హుజూర్ నగర్ ప్రజలు ఇచ్చిన తీర్పు కాదని, రాష్ట్ర సీఎం కేసీఆర్ వెంట ప్రజలు ఉన్నారనడానికి సూచిక అని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ చేస్తోన్న మంచి పనులను ప్రజలు గ్రహించారని ఎర్రబెల్లి అన్నారు. చిన్న ఘటనలను కూడా పెద్దవిగా చూపి దుష్ప్రచారం చేశారని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలు సహించరని చెప్పుకొచ్చారు. రాష్ట్ర సర్కారును ఇబ్బంది పెట్టేందుకు కొందరు చాలా ప్రయత్నాలు చేశారని, విపక్షాలు ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన హితవు పలికారు.

More Telugu News