Karnataka: స్వయంగా చితి పేర్చుకుని, నిప్పంటించి... దూకేసిన వృద్ధుడు!

  • ఆరు నెలల క్రితం మరణించిన కుమారుడు
  • చూసే వారు లేక దారుణ నిర్ణయం తీసుకున్న అజ్జప్ప
  • కర్ణాటక, దొడ్డబళ్లాపుర సమీపంలో ఘటన

వృద్ధాప్యంలో కంటికిరెప్పలా చూసుకుంటాడని భావించిన కుమారుడు చనిపోవడం, బంధువులంతా దూరం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వృద్ధుడు, తనకు తానుగా చితిని పేర్చుకుని, దానికి నిప్పంటించి, అందులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని దొడ్డబళ్లాపుర తాలూకా తిప్పూరు గ్రామంలో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, అజ్జప్ప (85) అనే వృద్ధుడు. గ్రామ శివారులోని గొరవెహళ్ల అటవీ ప్రాంతంలో కట్టెలు పేర్చుకుని, నిప్పంటించుకున్నాడు.

కాగా, అజ్జప్ప కుమారుడు సిద్ధప్ప (58), ఆరు నెలల క్రితం తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశాడు. అప్పటి నుంచి ఇల్లు వదిలి వెళ్లిన అజ్జప్ప దేవాలయాల్లో,పాడుబడ్డ మండపాల్లో పడుకుంటూ కాలం గడిపాడు. కోడలు, మనవళ్లతో ఉన్న గొడవల కారణంగా వారితోనూ మాట్లాడలేదు. నాలుగు రోజుల క్రితం అతను అదృశ్యం కాగా, గొర్రెలకాపర్లకు చితిపై సగం కాలిన శవం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు శవం అజ్జప్పదేనని, తనంతట తానే చితి పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. కేసును దర్యాఫ్తు చేస్తున్నామన్నారు.

More Telugu News