TTD: టీటీడీ పరిధిలోకి స్విమ్స్ ఆస్పత్రిని తీసుకుంటాం: వైవీ సుబ్బారెడ్డి

  • పాలకమండలి సమావేశంలో పలు తీర్మానాలు చేశాం
  • తిరుపతిలో సంపూర్ణ మద్యపాన నిషేధం
  • తిరుపతిలో 250 ఎకరాలలో ఆధ్యాత్మిక సిటీ  

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సమావేశాన్ని ఈరోజు నిర్వహించి, పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం మీడియాతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, టీటీడీ పరిధిలోకి స్విమ్స్ ఆస్పత్రిని తీసుకోవాలని, తిరుపతిలో 250 ఎకరాలలో ఆధ్యాత్మిక సిటీ నిర్మించాలని, గరుఢ వారధి నిర్మాణ పనుల రీడిజైన్ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.

ఇటీవల విజయవంతంగా జరిగిన బ్రహ్మోత్సవాల నిర్వహణకు సహకరించిన టీటీడీ శాశ్వత  ఉద్యోగులకు రూ.14 వేల చొప్పున, కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.6,500 చొప్పున 'బ్రహ్మోత్సవ బహుమానం' ఇవ్వాలని తీర్మానించినట్టు ఆయన చెప్పారు. బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని, మూడు నెలల్లోగా తిరుమలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని తీర్మానించినట్టు తెలియజేశారు.

 టీటీడీలో వంశపారంపర్య అర్చక వ్యవస్థను అమలు చేస్తామని, ఈవో నేతృత్వంలో ఓ కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తిరుపతిలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి  తీర్మానం చేసిందని, టీటీడీ పరిధిలోని 162 మంది అటవీ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.

More Telugu News