Crime News: దెయ్యాన్ని వదిలిస్తామని చెప్పి.. బంగారాన్ని దోచేసిన దంపతులు!

  • మంత్రాలతో మాయం చేస్తామంటూ మోసం
  • నిందితులను అరెస్టు చేసిన కడప పోలీసులు
  • బాధితులపై పోలీసుల ఆరా

జనంలో మూఢనమ్మకాలే వారి పెట్టుబడి. దెయ్యిం పేరు చెప్పి దోచుకోవడం వారికి అలవాటు. ఇప్పటికే ఎంతోమందిని మోసం చేసిన దంపతులు పాపం పండడంతో చివరికి పోలీసులకు చిక్కారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 790 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కడప డీఎస్పీ సూర్యనారాయణ తెలియజేసిన వివరాల ప్రకారం, కడప పట్టణానికి చెందిన షేక్‌ ఆస్మా కొత్త ఇల్లు నిర్మాణం తలపెట్టాడు. తరచూ నిర్మాణానికి ఆటంకాలు ఎదురవుతుండడంతో అనుమానం వచ్చింది. విషయాన్ని రవీంద్రనగర్‌లోని మురాదియనగర్‌కు చెందిన జముల్లాబాషా, అతని భార్య సయ్యద్‌ నవీద్‌సుల్తానా దృష్టికి తీసుకువెళ్లాడు.

దీంతో దంపతులు షేక్‌ ఆస్మా నిర్మిస్తున్న ఇంటిని పరిశీలించారు. ఇంట్లో దెయ్యం ఉందని, దానివల్లే ఆటంకాలు ఎదురవుతున్నాయని నమ్మబలికారు. ఇంటి నుంచి దెయ్యాన్ని వదిలించేందుకు బంగారు నగలతో ప్రత్యేక పూజలు చేసి పట్టుకుని సీసాలో బంధిస్తామని చెప్పారు. ఇదంతా నిజమేననుకున్న ఆస్మా అందుకు ఒప్పుకున్నాడు.

పూజల అనంతరం సీసాలో దెయ్యాన్ని బంధించినట్టు చెప్పాడు. సీసాపై బంగారు ఆభరణాలు ఉంచాలని, లేదంటే ప్రమాదమని చెప్పడంతో ఆస్మా తన ఇంట్లో ఉన్న 221 గ్రాముల బంగారాన్ని సీసాపై ఉంచాడు. ఎన్నాళ్లయినా నగలు తిరిగి ఇవ్వకపోవడంతో ఆస్మా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ దంపతుల మోసం ఒక్కసారిగా వెలుగు చూసింది.

అప్పటికే వీరు చాలామందిని మోసం చేశారని బయటపడింది. తమ గుట్టు బయటపడిందని తెలియగానే దంపతులు పారిపోయేందుకు ప్రయత్నించగా, అరెస్టు చేసి వారివద్ద నుంచి పోలీసులు 790 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మూఢనమ్మకాలు వద్దని, ఈ దంపతుల బాధితుల ఇంకా ఎవరైనా ఉంటే నిర్భయంగా తమను సంప్రదించాలని కోరారు.

More Telugu News