Khammam District: ఫిర్యాదు కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చి.. కానిస్టేబుల్ వేలు కొరికి బీభత్సం!

  • పోలీస్ స్టేషన్‌లో వీరంగం
  • అడ్డుకున్న ఏఎస్సైపైనా దాడి
  • స్టేషన్ అందాలు బద్దలుగొట్టి రభస

ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ వ్యక్తి బీభత్సం సృష్టించాడు. కానిస్టేబుల్‌తో మాట్లాడుతూ అతడి చేతి వేలిని కొరికేశాడు. సోమవారం అర్ధరాత్రి ఖమ్మంలో జరిగిందీ ఘటన. స్థానిక నాయీబ్రాహ్మణ కాలనీకి చెందిన డుంగ్రోతు మస్తాన్, మరో ఇద్దరు కలిసి అర్ధరాత్రి వేళ ఖమ్మం ఒకటో పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈ క్రమంలో మస్తాన్ చెలరేగిపోయాడు. కానిస్టేబుల్ మన్సూర్ అలీకి వివరాలు చెప్పే క్రమంలో అతడి చేయి అందుకుని చిటికెన వేలిని కొరికి, కట్ చేసి దానిని నేలపై పడేశాడు. తొడభాగంలోనూ కొరికాడు.

ఏఎస్సై నాగేశ్వరరావు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆయనపైనా మస్తాన్ దాడిచేశాడు. స్టేషన్ అద్దాలను బద్దలుగొట్టాడు. మస్తాన్ ఇలా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదని పోలీసులు తెలిపారు. గత కొన్నేళ్లుగా అతడు ఇలానే ప్రవర్తిస్తున్నట్టు చెప్పారు. ఓసారి రైలు పట్టాలపై కూర్చుని కాళ్లుపెట్టడంతో అతడి రెండు కాళ్లు తెగిపోయినట్టు తెలిపారు. పలు పోలీస్ స్టేషన్లలో అతడిపై కేసులు నమోదయ్యాయని వివరించారు. ప్రస్తుత ఘటనపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు.

More Telugu News