Nandan Nilekani: ఆ ఫిర్యాదులను నిష్పక్షపాతంగా ఎదుర్కొంటాము.. ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నందన్ నీలేకని

  • ఫిర్యాదులతో కంపెనీ షేర్ విలువ 16 శాతం డౌన్ 
  • విజిల్ బ్లోయర్స్  సాక్ష్యాలను ఇంకా పంపలేదు
  • బోర్డు అన్ని విషయాలను విచారిస్తోంది

భారత్ కు చెందిన రెండో అతి పెద్ద ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నతాధికారులపై అవినీతి ఫిర్యాదుల నేపథ్యంలో సంస్థ సహ వ్యవస్థాపకుడు, నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నందన్ నీలేకని స్పందిస్తూ.. ఈ ఫిర్యాదులను నిష్పక్షపాతంగా, అంశాలవారీగా ఎదుర్కొంటామని చెప్పారు. మరోవైపు ఈ ఫిర్యాదుల మూలంగా సంస్థ షేర్ విలువ నేడు 16 శాతం క్షీణించింది. సంస్థకు చెందిన గుర్తు తెలియని ఉద్యోగులు సీఈవో సలీల్ పారెఖ్, సీఎఫ్ వో నీలాంజన్ రాయ్ లపై ఫిర్యాదు చేస్తూ బోర్డుకు లేఖలు రాశారు. కంపెనీ లాభాలను పెంచి చూపేందుకు వీరు అకౌంటింగ్ లో అనైతిక చర్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. వీరి ఫిర్యాదులను ఆడిట్ కమిటీ ముందు పెడతామని బోర్డు ప్రకటించింది.

నందన్ నీలేకని వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి...

* కంపెనీ బోర్డు సభ్యుడొకరు 30 సెప్టెంబర్ 2019న రెండు ఫిర్యాదులను అందుకున్నారు.   20 సెప్టెంబర్ 2019 అని తేదీ రాసి ఉన్న లేఖలో  ‘అనైతిక చర్యలతో కంపెనీకి హాని’ అని టైటిల్ ఉండగా, రెండో లేఖలో తేదీని పేర్కొనలేదు. టైటిల్ ‘ విజిల్ బ్లోయర్ ఫిర్యాదు’ అని ఉంది.

* విజిల్ బ్లోయర్ (ప్రజావేగు) ఫిర్యాదులపై స్పందనగా  అక్టోబర్ 10, 2019 న వాటిని ఆడిట్ కమిటీ ముందు పెట్టాము. అక్టోబర్ 11న నాన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులతో కూడిన బోర్డుకు సమర్పించారు.

* ఈ ఫిర్యాదులను ఒక్కో అంశంగా తీసుకొని విచారణ చేస్తాము. విచారణ నిష్పక్షపాతంగా సాగుతుంది. తేదీ పేర్కొనని ఫిర్యాది లేఖలో సీఈవోపై ఫిర్యాదులున్నాయి. ఆయన అమెరికా, ముంబైలకు జరిపిన ప్రయాణాలపై ఆరోపణలున్నాయి.

* అక్టోబర్ 3, 2019న ఫిర్యాదుదారులు లేఖను విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ ప్రొగ్రామ్, వాషింగ్టన్ డి.సికి రాసినట్టు మాకు అక్టోబర్ 16న తెలిసింది.

* ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులకు సంబంధించి వాయిస్ రికార్డింగ్ లు, ఇతర సాక్ష్యాలు పంపలేదు. అయినప్పటికి వీరి ఆరోపణలపై మేము పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నాము.

* ఆడిట్ కమిటీకి తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్11నే అది విచారణ ప్రారంభించింది.  స్వతంత్ర అంతర్గత ఆడిటర్స్ ( ఎర్నెస్ట్ అండ్ యంగ్ ) తో సంప్రదింపులు ప్రారంభించింది. కంపెనీకి చెందిన లీగల్ వ్యవహారాలను షార్దూల్ అమర్ చంద్ మంగల్ దాస్ అండ్ కో స్వంతంత్రంగా చూసుకుంటుంది.

More Telugu News