Telugudesam: ఇలాంటి రాక్షసపాలన ప్రపంచంలో ఎక్కడా వుండదేమో!: వైసీపీ ప్రభుత్వంపై కేశినేని నాని ఫైర్

  • ప్రభుత్వం తీరును నిరసిస్తూ గవర్నర్ కు ఫిర్యాదు చేశాం
  • గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరాం
  • సభ్యసమాజం తలదించుకునేలా ప్రభుత్వం తీరు ఉంది  

ఏపీలో టీడీపీ నేతలపై దాడులు ఎక్కువయ్యాయని ఎంపీ కేశినేని నాని ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ ను టీడీపీ నేతలు కలిశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం కేసులు బనాయిస్తోందని ఆయనకు ఫిర్యాదు చేశారు.

అనంతరం, మీడియాతో నాని మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం తీరును నిరసిస్తూ గవర్నర్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు. గవర్నర్ జోక్యం చేసుకుని పరిస్థితులను చక్కదిద్దాలని ఆయనకు విన్నవించినట్టు తెలిపారు. ఇలాంటి రాక్షసపాలన దేశంలోనే కాదు, ప్రపంచంలోఏ ఎక్కడా వుండదేమోనంటూ వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అరాచకాలు, దౌర్జన్యాలు, దమనకాండలు సాగిస్తూ, ముఖ్యంగా టీడీపీ నాయకులపై వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.

పోలీస్ వ్యవస్థను ప్రభుత్వం తమకు అనుకూలంగా మార్చుకున్న తీరు చూస్తే సభ్యసమాజం తలదించుకునేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేయడం దారుణమని నిప్పులు చెరిగిన కేశినేని, సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై విమర్శలు గుప్పించారు. జగన్ తనపై ఉన్న కేసులు మాఫీ చేసుకోవడానికే ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు.

More Telugu News