Infosys: ఇన్ఫోసిస్ లో సత్యం తరహా స్కామ్... ఉద్యోగుల లేఖతో కుప్పకూలిన ఈక్విటీ విలువ!

  • అవకతవకలకు పాల్పడిన సీఈఓ, సీఎఫ్ఓ
  • లేఖ రాసిన ఉద్యోగులు
  • 14 శాతానికి పైగా నష్టంలో ఈక్విటీ వాల్యూ

కంపెనీ లాభాలను కృత్రిమంగా పెంచి చూపేందుకు వీరు లెక్కల్లో అనైతిక చర్యలకు పాల్పడ్డారంటూ, ఓ సంఘంగా ఏర్పడిన ఇన్ఫోసిస్ ఉద్యోగులు బహిరంగ లేఖను రాయడం కార్పొరేట్ వర్గాల్లో, ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీలో తీవ్ర ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇన్ఫీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలిల్ పరేఖ్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిలంజన్ రాయ్ లు అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారని, వీరు ఆడిటర్లను కూడా మేనేజ్ చేశారని కొందరు ఉద్యోగులు తమ లేఖలో పేర్కొన్నారు.

దీని ఫలితంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినగా, 2013 తరువాత ఇన్ఫీ ఈక్విటీ విలువ భారీగా నష్టపోయింది. ఈ ఉదయం ట్రేడింగ్ సెషన్ ప్రారంభమైన తరువాత 16 శాతానికి పైగా నష్టపోయిన ఈక్విటీ వాల్యూ, ప్రస్తుతం 14.13 శాతం నష్టంతో రూ. 660 వద్ద కొనసాగుతోంది. దీని ప్రభావం ఇతర ఐటీ కంపెనీలపైనా పడింది.

కాగా, దాదాపు పదేళ్ల క్రితం హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న సత్యం కంప్యూటర్స్ లోనూ ఇదే తరహా స్కామ్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ కుంభకోణం తీవ్ర కలకలం రేపగా, ఆపై జరిగిన పరిణామాలతో, సత్యం కంప్యూటర్స్ టెక్ మహీంద్రాలో విలీనమైంది.

ఇదిలావుండగా, ఉదయం 12.20 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక క్రితం ముగింపుతో పోలిస్తే 60 పాయింట్ల లాభంతో 39,358 వద్ద కొనసాగుతుండగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచిక 27 పాయింట్ల లాభంతో 11,689 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. యస్ బ్యాంక్, ఐసీఐసీఐ, భారతీ ఎయిర్ టెల్, గ్రాసిమ్ తదితర కంపెనీలు లాభాల్లోనూ, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా తదితర కంపెనీలు నష్టాల్లోనూ నడుస్తున్నాయి.

More Telugu News