Chittoor District: స్కూటర్ ను చేజ్ చేసిన ఎక్సైజ్ పోలీసుల కారు బోల్తా!

  • చిత్తూరు జిల్లాలో ఘటన
  • సారాతో వెళుతున్న వ్యక్తిని పట్టుకోబోయి ప్రమాదం
  • గాయపడ్డ పోలీసులు వేలూరు సీఎంసీకి తరలింపు

స్కూటర్ పై పారిపోతున్న ఓ నిందితుడిని పట్టుకునే క్రమంలో ఎక్సైజ్ పోలీసులు చేజ్ చేయగా, వారి కారు బోల్తా పడి, ఎస్సై, కానిస్టేబుల్‌ కు గాయాలయ్యాయి. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. నాటు సారా తీసుకుని వెళుతున్న ఓ వ్యక్తి స్కూటర్ ను ఎక్సైజ్ పోలీసులు ఆపబోగా, ఆ వ్యక్తి ఉడాయించాడు. అతన్ని పట్టుకునేందుకు వేగంగా వెళుతున్న క్రమంలో అదుపు తప్పిన ఎక్సైజ్‌ కారు బోల్తా పడింది.

కారులో ప్రయాణిస్తున్న ఎన్‌ ఫోర్స్‌ మెంట్ ఎస్సై రవికుమార్‌, కానిస్టేబుల్‌ రమేష్‌ కు గాయాలుకాగా, చికిత్స నిమిత్తం వారిని తమిళనాడు వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. కారుకు ప్రమాదం జరగడాన్ని గమనించిన నిందితుడు, సారాతో సహా స్కూటర్‌ ను అక్కడే వదిలి పరారు కావడం గమనార్హం. ఎక్సైజ్ పోలీసుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు.

More Telugu News