Nellore District: అమ్మను చంపొద్దని బతిమాలిన పిల్లలు.. వినిపించుకోని తండ్రి!

  • కుమార్తెల ఎదుటే తల్లిని దారుణంగా నరికి చంపిన భర్త
  • విషయం బయటపడకుండా అంత్యక్రియలు
  • పరారీలో నిందితుడు

తల్లిని చంపొద్దంటూ కన్నబిడ్డలు కాళ్లావేళ్లా పడినా ఆ తండ్రి మనసు కరగలేదు. వారు చూస్తుండగానే భార్యను దారుణంగా హత్యచేశాడు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, నాయుడుపేట మండలం, మేనకూరు పంచాయతీ పరిధిలోని వద్దిగుంటకండ్రిగలో జరిగిందీ ఘటన. ఆదివారం రాత్రి ఈ ఘటన జరగ్గా సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన మునిరాజా, ప్రమీల (29) దంపతులు. 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా, పెద్దమ్మాయి లావణ్య తొమ్మిదో తరగతి చదువుతోంది. రెండో కుమార్తె మాధురి ఆరో తరగతి చదువుతోంది.

కాగా, ఇటీవల భార్య ప్రమీలపై భర్త మునిరాజా అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి బాత్రూముకని బయటకు వెళ్లి వచ్చిన భార్యను ఎక్కడికెళ్లావంటూ భర్త ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య వాదులాట మొదలైంది. అది క్రమంగా పెద్ద గొడవగా మారింది. పెద్దపెద్దగా అరుచుకుంటుండడంతో నిద్రపోతున్న కుమార్తెలు లేచారు.

అప్పటికే భార్యను నరికేందుకు చేతిలో కత్తిపట్టుకుని ఉన్న తండ్రిని చూసిన కుమార్తెలు షాకయ్యారు. అంతపని చేయొద్దంటూ తండ్రిని బతిమాలారు. అయినప్పటికీ వినిపించుకోని మునిరాజా భార్యను కత్తితో విచక్షణ రహితంగా నరికాడు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

విషయం తెలిసిన బంధువులు ఇంటికి చేరుకుని విషయం బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. ఉదయం ఏడు గంటలు కూడా కాకముందే అంత్యక్రియలు నిర్వహించి మృతదేహాన్ని దహనం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మునిరాజా ఇంటికి వెళ్లి పిల్లలను అడిగి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

More Telugu News