Bjp: వైసీపీ ప్రభుత్వం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చూస్తూ వూరుకోం: సుజనాచౌదరి

  • మన దురదృష్టం కొద్దీ అధికారంలోకి వచ్చింది
  • చేయగలిగిందేమీ లేదు
  • ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండండి..బీజేపీ అండగా ఉంటుంది

ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీరుపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి విరుచుకుపడ్డారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఈరోజు నిర్వహించిన గాంధీ సంకల్పయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, మన దురదృష్టం కొద్దీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో వైసీపీ రాజ్యాధికారంలోకి వచ్చింది కనుక, చేయగలిగిందేమీ లేదు కానీ, ప్రజలకు అండగా బీజేపీ ఉందని అన్నారు.

‘ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండండి. వాళ్లు (వైసీపీ) కనుక పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే కేంద్ర ప్రభుత్వం గానీ, భారతీయ జనతా పార్టీ గానీ చూస్తూ ఊరుకోవడం జరగదు’ అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలోని విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)లను రద్దు చేయొద్దని కేంద్రం చెబుతున్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ‘గుడ్డెద్దు చేలో పడ్డట్టు పోతున్నారు. ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలించే విధానం కాదు’ అని ధ్వజమెత్తారు.

More Telugu News