Dharmavaram: 1995 తర్వాత ఉమ్మడి ఏపీలో ఆ రెండు కుటంబాల మధ్యే రాజకీయాలు నడిచాయి: బీజేపీ ఎంపీ సుజనా చౌదరి

  • చంద్రబాబు కుటుంబం వర్సెస్ వైఎస్ కుటుంబం మీదుగా రాజకీయాలు 
  • టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఏం తేడా లేదు
  • ఏపీలో రివర్స్ పాలన సాగుతోంది

అనంతపురం జిల్లా ధర్మవరంలో ఈరోజు నిర్వహించిన గాంధీజీ సంకల్ప యాత్రలో బీజేపీ ఎంపీ సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మరణించిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రాజకీయాలన్నీ కూడా రెండు కుటుంబాల మధ్యేనని అన్నారు.

1995 తర్వాత నుంచి ఇప్పటి వరకూ కూడా చంద్రబాబునాయుడు కుటుంబం వర్సెస్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం మీదుగా రాజకీయాలు నడిచాయని, ఒక సిద్ధాంత పరంగా రాజకీయాలు నడవలేదని అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఏం తేడా లేదని, వలసపక్షుల్లా అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటూ పార్టీలు మారుతూ వచ్చారని అన్నారు.  

ఇక, మన రాష్ట్ర పరిస్థితి చూస్తే.. రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రంలో రివర్స్ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ‘రివర్స్’తో మిగిలే సొమ్ముకంటే ప్రాజెక్టు పనుల జాప్యం వల్ల జరిగే నష్టం ఎక్కువ అని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఇంకా ఆలస్యం చేయకుండా త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వైసీపీ, తెలుగుదేశం పార్టీ సహా ప్రాంతీయపార్టీలతో రాష్ట్రానికి జరిగే మేలు కంటే నష్టమే ఎక్కువ అని అన్నారు. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని మండిపడ్డారు.

More Telugu News