TSRTC: నష్టాల సాకుతో ఆర్టీసీని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారు: కార్మిక సంఘాల ఆరోపణ

  • జీతాల చెల్లింపుకు రూ.224 కోట్లు అవసరం
  • ఆర్టీసీ వద్ద రూ.7.5 కోట్లు మాత్రమే ఉన్నాయి: అడ్వకేట్ జనరల్
  • తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా

ఆర్టీసీ నష్టాల్లో ఉందన్న సాకుతో సంస్థను  విచ్ఛిన్నం చేయాలని ప్రభుత్వం చూస్తోందని కార్మికులు ఆరోపించారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో హైకోర్టులో  కొనసాగుతున్న విచారణలో..  కార్మికులకు జీతాల చెల్లింపుకు సరిపడా మొత్తం లేదన్న రాష్ట్ర అడ్వకేట్ జనరల్ వాదనపై కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. కార్మికులకు జీతాలు చెల్లించాలన్న డిమాండ్ తో గతవారం దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు 21వ తేదీలోగా జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.

కోర్టు విధించిన గడువు  ఈరోజుతో ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం  తన స్పందనను కోర్టుకు వివరించింది. జీతాల చెల్లింపుకు రూ. 224 కోట్లు అవసరం కాగా, ఆర్టీసీ వద్ద రూ.7.5 కోట్లు మాత్రమే ఉన్నాయని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. అడ్వకేట్ జనరల్ వాదనను కార్మికులు ఖండిస్తూ.. ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఆరేళ్లుగా రాని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చిందని కార్మికులు ప్రశ్నించారు. తప్పుడు సమాచారాన్ని ప్రభుత్వం కోర్టుకు సమర్పిస్తోందన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

More Telugu News