Andhra Pradesh: రాష్ట్రంలో ఇసుక కొరత త్వరలోనే తీరుతుంది: ఏపీ మంత్రి అనిల్ కుమార్

  • వరదల కారణంగా ఇసుక తవ్వలేకపోతున్నాం
  • ప్రస్తుతానికి శ్రీకాకుళం, నెల్లూరు నుంచే ఇసుక వస్తోంది
  • జగన్ సీఎం అయ్యాక ప్రాజెక్టులకు జలకళ వచ్చింది

ఏపీలో కొన్ని నెలలుగా నెలకొన్న ఇసుక కొరతపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. తాడేపల్లిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కృష్ణా, గోదావరి నదులకు వరదల కారణంగా ఇసుక తవ్వలేకపోతున్నామని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత త్వరలోనే తీరుతుందని చెప్పారు. ప్రస్తుతానికి శ్రీకాకుళం, నెల్లూరు ప్రాంతాల నుంచే మనకు ఇసుక వస్తోందని అన్నారు.

వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని, ప్రాజెక్టులకు జలకళ వచ్చిందని, రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రం పచ్చగా ఉంటే ప్రతిపక్ష నేతలు ఓర్వలేకపోతున్నారని, ‘ఆ భగవంతుడే వీళ్లను కాపాడాలి’ అని పేర్కొన్నారు. ఊసరవెల్లి రాజకీయాలు చంద్రబాబుకే చెల్లుతాయని విమర్శించారు. మొన్నటి వరకూ బీజేపీ ప్రభుత్వం పై విమర్శలు చేసిన బాబు ఇప్పుడు యూ-టర్న్ తీసుకునేందుకు చూస్తున్నారని విమర్శించారు.

More Telugu News