Shami: రాంచీలో నిప్పులు చెరుగుతున్న షమీ... ఫాలో ఆన్ లో 4 వికెట్లు కోల్పోయిన సఫారీలు

  • మరో విజయం ముంగిట టీమిండియా
  • ఫాలో ఆన్ లో పడిన సఫారీలు
  • షమీకి 3 వికెట్లు

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ తన సెన్సేషనల్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. మరోసారి నిప్పులు చెరిగే బంతులతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో 162 పరుగులకే ఆలౌటై, ఫాలో ఆన్ లో పడిన సఫారీలను షమీ అస్సలు కుదుటపడనివ్వలేదు. బంతిని సమర్థంగా స్వింగ్ చేస్తూ 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్ లో అర్ధసెంచరీ సాధించిన జుబేర్ హంజా ఈసారి షమీ ధాటికి డకౌట్ అయ్యాడు. కెప్టెన్ డుప్లెసిస్ సైతం షమీ బాధితుడే. షమీ విసిరిన బంతిని సరిగా అంచనా వేయలేక వికెట్ల ముందు దొరికిపోయాడు. మిడిలార్డర్ బ్యాట్స్ మన్ టెంబా బవుమా (0) సైతం షమీ ఖాతాలోకే చేరాడు.

కాగా, భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను 497/9 స్కోరు వద్ద డిక్లేర్ చేయగా, సఫారీలు తొలి ఇన్నింగ్స్ లో 162 పరుగులకు ఆలౌట్ కావడం ద్వారా 335 పరుగులు వెనుకబడ్డారు. తొలుత ఉమేశ్ యాదవ్ సఫారీ స్టార్ బ్యాట్స్ మన్ డికాక్ (5)ను అవుట్ చేయగా, ఆ తర్వాత షమీ శివాలెత్తినట్టు బౌలింగ్ చేశాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 4 వికెట్లకు 26 పరుగులు మాత్రమే. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ డీన్ ఎల్గార్ (16), వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ (0) ఆడుతున్నారు.

More Telugu News