Haryana: సైకిల్ తొక్కుతూ వచ్చి ఓటేసిన హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్

  • హర్యానా, మహారాష్ట్రల్లో కొనసాగుతోన్న పోలింగ్
  • ఓటు హక్కు వినియోగించుకున్న ఇరు రాష్ట్రాల సీఎంలు
  • మరోసారి విజయం సాధిస్తామన్న గడ్కరీ

హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సైకిల్ తొక్కుతూ కర్నాల్ పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆయనతో పాటు పలువురు కార్యకర్తలు కూడా సైకిల్ పైనే పోలింగ్ కేంద్రానికి వచ్చారు. రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని ఖట్టర్ అన్నారు. కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ ఇప్పటికే ఓడిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫఢ్నవీస్ తన అర్థాంగి అమృత, తల్లి సరితలతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాగ్ పూర్ లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓటు హక్కు వినియోగించుకొని మీడియాతో మాట్లాడారు.

'ఈ రోజు ప్రజాస్వామ్య పండుగ. ప్రజలందరూ ఓటు వేసి దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తిమంతం చేయాలని కోరుతున్నాను. బీజేపీ, శివసేన, రిపబ్లికన్ పార్టీల కూటమి ఈ ఎన్నికల్లోనూ రికార్డు స్థాయిలో భారీ విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నాను. దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో ఫడ్నవీస్ ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం చాలా పనులు చేశాయి. నోటాకి ఓటు వేయొద్దు. దేశ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు' అని గడ్కరీ వ్యాఖ్యానించారు.

More Telugu News