Jagan: నేడు ఢిల్లీకి జగన్.. కేంద్ర మంత్రులతో భేటీ!

  • ఉదయం 10:05 గంటలకు గన్నవరం నుంచి ఢిల్లీకి 
  • మధ్యాహ్నం అమిత్ షాతో భేటీ 
  • రేపు ఇతర కేంద్ర మంత్రులతో సమావేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ ఉదయం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించనున్న పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం 9:50 గంటలకు జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.

అక్కడి నుంచి 10:05కి విమానంలో ఢిల్లీ బయల్దేరతారు. మధ్యాహ్నం 12.20కి ఢిల్లీ చేరుకుని నేరుగా తన అధికార నివాసమైన 1-జన్‌పథ్‌కు చేరుకుంటారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సహా ఇతర కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు. ముందుగా మధ్యాహ్నం అమిత్ షాను కలుస్తారని సమాచారం.

షాతో భేటీకి జగన్ ఇంతకుముందు మూడుసార్లు ప్రయత్నించినప్పటికీ, ఆయన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో బిజీగా ఉండడంతో అప్పట్లో వీరిద్దరి మధ్య భేటీకి అవకాశం లభించలేదు. ప్రచారం ముగిసి నేడు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రోజు ఆయనను జగన్ కలవనున్నారు. రేపు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌‌ తదితరులను కలుస్తారు. రేపు సాయంకాలం జగన్ ఆంధ్రాకు తిరుగుపయనమవుతారు.

More Telugu News