Electricity Board: తెలంగాణ విద్యుత్ కార్మికుల డిమాండ్లకు యాజమాన్యం ఓకే!

  • ఆర్టిజన్ల డిమాండ్లు నెరవేర్చడానికి సానుకూలం  
  • విద్యుత్ సౌధలో సీఎండీలతో భేటీ అయిన కార్మిక సంఘాల నేతలు
  • సమ్మె తాత్కాలికంగా వాయిదా

తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘాలు తమ డిమాండ్ల సాధనలో విజయం సాధించారు. కార్మిక సంఘాలు, విద్యుత్ సంస్థల సీఎండీలతో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. రెండు గంటల పాటు సాగిన ఈ చర్చల్లో ఆర్టిజన్ల డిమాండ్ల పరిష్కారానికి యాజమాన్యం ఒప్పుకుంది. ఈ మేరకు వివరాలను 1104 యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా మీడియాకు వెల్లడించారు.

కార్మికుల మరో డిమాండైన ఉద్యోగులకు జీపీఎఫ్ విధానం తిరిగి వర్తింపచేయడం, మరికొన్ని డిమాండ్లను నెరవేర్చడానికి యాజమాన్యం కొంత సమయాన్ని కోరిందని అన్నారు. చర్చలు తమకు అనుకూలంగా సాగడంతో కార్మిక సంఘాలు సమ్మెను తాత్కాలికంగా నిలిపి వేసినట్లు ప్రకటించారు. వచ్చే నెలలో మరోసారి యాజమాన్యాలతో చర్చలు కొనసాగించనున్నట్లు ఆయన వెల్లడించారు.

More Telugu News