Asaduddin Owaisi: అసదుద్దీన్‌ స్టెప్‌ అదిరింది.. ఎన్నికల ప్రచార సభలో ఎంఐఎం చీఫ్ సందడి

  • మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారం
  • స్టేజీ దిగిపోతూ డ్యాన్స్‌ చేసిన ఎంపీ
  • అంతకు ముందు ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజం

ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఎన్నికల సభలో అదరగొట్టే స్టెప్స్‌తో ఆకట్టుకున్నారు. తమ పార్టీ గుర్తు గాలిపటం ఎగరేస్తున్నట్లు ఆయన చేసిన డ్యాన్స్‌ సభికులను అమితాశ్చర్యంలో ముంచెత్తింది.

 వివరాల్లోకి వెళితే... మహారాష్ట్ర అసెంబ్లీకి ఈ నెలలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 44 స్థానాల్లో ఎంఐఎం తన అభ్యర్థులను నిలిపింది. దీంతో  ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న రాత్రి అసదుద్దీన్‌ ఔరంగాబాద్‌లోని పైథాన్‌గేట్‌ వద్ద జరిగిన ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడారు. అనంతరం స్టేజీ దిగుతూ స్టెప్స్‌ వేశారు. అనుకోకుండా జరిగిన ఈ పరిణామం కార్యకర్తల్లో ఫుల్‌జోష్‌ నింపింది.

అంతకుముందు జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని నరేంద్రమోదీపై అసదుద్దీన్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఎన్నికల సమయంలోనే ఆయనకు వివాదాస్పద అంశాలు గుర్తుకు వస్తాయి. వీటిని లేవనెత్తి మతవాదులు, ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుదారులకు సంకేతాలు ఇస్తారు. ఇంగ్లీష్‌లో దీన్ని ‘డాగ్‌ విజిల్‌ పాలిటిక్స్‌’ అంటారు’ అని విరుచుకుపడ్డారు.

1993 బాంబు పేలుడు నిందితులందరికీ శిక్ష పడిందని, యాకూబ్‌ను ఉరితీశామని ప్రధాని చెబుతారని, కానీ శ్రీకృష్ణ కమిషన్‌ నివేదిక సూచించినట్లు బాధితులకు న్యాయం చేసేందుకు మాత్రం ఆలోచించరని ఎద్దేవా చేశారు.

More Telugu News